
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ తనకు లభించిన విరామంలో కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు గాను కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన భార్య, కూతురితో కలిసి అక్కడి నదీ జలాల్లో విహరిస్తూ.. సరదాగా చేపలు పట్టిన సంగతి తెలిసిందే.
అంతేకాదు అక్కడి ప్రత్యేక వంటకాలను సైతం క్రిస్ గేల్ రుచి చూశాడు. ఇలా కొద్దిపాటి విరామ సమయాన్ని ఎంతో ఉత్సాహాంగా గడుపుతూ కనిపించిన క్రిస్ గేల్ తిరిగి జిమ్లో కుస్తీ పడుతున్నట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం పేర్కొంది. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
అంతకుముందు క్రిస్ గేల్ కేరళ వంటకాలను రుచిచూస్తూ.. అక్కడి పర్యాటక అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను కేరళ పర్యాటక శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఈ సీజన్లో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గేల్కు చోటు కల్పించలేదు. అయితే ఆ తర్వాత నాలుగు మ్యాచ్లాడిన గేల్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో మొత్తం 252 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 23 సిక్సులు ఉన్నాయి. టోర్నీలో భాగంగా పంజాబ్ ఇండోర్ వేదికగా మే 4న ముంబై ఇండియన్స్తో తలపడనుంది.
ఇప్పటికే ప్లేఆఫ్కు చేరువలో ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.