హైదరాబాద్: అత్యంత ఉత్సాహం భారీ అంచనాలతో ఐపీఎల్ 11వ సీజన్ మొదలైంది. తీవ్రమైన ఉత్కంఠభరిత పరిస్థితుల్లో మొదటి మ్యాచ్ పూర్తి అయింది. ఈ మ్యాచ్లో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ల నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఒకే నంబర్ గల జెర్సీని ధరించి ప్రత్యేకంగా కనిపించారు. వారిద్దరూ 400నంబరు గల జెర్సీతో ఒకేసారి మైదానంలో కనిపించడంతో అందరిలో వారి నంబర్లపై అనుమానం కలిగింది.
ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పోలార్డ్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వారి వ్యక్తిగత మైలురాళ్లకు గుర్తుగా ఈ జెర్సీలను ధరించారు. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో వివరణ ఇచ్చాడు. తాము 400 నెంబర్ గల జెర్సీ ధరించడానికి ఓ కారణముందన్నారు.
కీరన్ పొలార్డ్కు ఇది 400వ టీ 20 మ్యాచ్ అని, అలాగే టీట్వంటీలో 400 వికెట్లు తీసుకున్న తొలిబౌలర్ను తానేనని, ఇందుకు గుర్తుకు తామిద్దరం 400 నెంబర్ ఉన్న జెర్సీని ధరించామని తెలిపారు. ఈ టోర్నమెంట్ అనంతరం తమ పాత జెర్సీలు పోలార్డ్(47), బ్రావో(55)లు ధరిస్తామని వివరించారు.
పోలార్డ్ ముంబై ఇండియన్స్ టీంతోనూ, తాను సీఎస్కే జట్టుతోనూ ముందే మాట్లాడి తుది జట్టులో అవకాశం కల్పించాలని కోరామన్నారు. శనివారం మ్యాచ్లో బ్రావో 30 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 68 పరుగులు చేసి చెన్నై జట్టును గెలిపించిన సంగతి తెల్సిందే.