
హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరుపున ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ రాణా మాత్రమేనని ఆ జట్టు హెడ్ కోచ్ జాక్వస్ కల్లిస్ వెల్లడించాడు. గతేడాది ముంబై ఇండియన్ ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రాణా ఈ ఏడాది కోల్కతా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
కోల్కతా నైట్రైడర్స్ జట్టులో మూడో స్థానంలో బరిలోకి దిగుతున్న రాణా ఐపీఎల్ 11వ సీజన్లో అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ఇప్పటికే రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. నితీశ్ రాణాను తాము నిరంతరం ప్రోత్సహిస్తున్నామని అది మంచి సత్ఫలితాలని ఇస్తోందని కలిస్ చెప్పుకొచ్చాడు.
'నిజానికి రాణా గురించి కొంచెం పాజిటివ్ టాక్ విన్నాం. అయితే ముంబై తరఫున చాలినన్ని అవకాశాలు అతడికి రాలేదు. కోల్కతాలో నితీష్ రాణాకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మధ్యలో ఉన్నాం. ఇప్పటివరకు చాలా మంచి క్రికెట్ ఆడాం' అని కల్లిస్ అన్నాడు.
రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి ప్లేఆఫ్కు చేరుకుంటామని కల్లిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఆండ్రూ రసెల్ కోల్కతా తదుపరి మ్యాచ్కి అందుబాటులోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.