
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన వేలంలో చెన్నై యాజమాన్యం డబ్బులన్నీ వృథా చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ వేలానికి ముందు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను ప్లేయర్ రిటెన్షన్ పద్ధతిలో అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, మిగిలిన 22 మందిని వేలంలో కొనుగోలు చేసింది. అయితే, వేలంలో చెన్నై యాజమాన్యం వ్యవహారించిన తీరుపై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
వేలంలో యువ క్రికెటర్లను కాదని సీనియర్ క్రికెటర్లను తీసుకోవడంపై అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన మెత్తం 25 మంది ఆటగాళ్లలో 11 మంది వయసు రీత్యా 30 ఏళ్లకు పైబడినవారే కావడం విశేషం. దీంతో చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు.
చెన్నై లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ను కాదని హర్భజన్ సింగ్ను తీసుకోవడం ఏంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అంతేకాదు 30 ఏళ్లకు పైబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ధోని జట్టుకు పెన్షన్ పథకం అమలు చేయండని కొందరంటే.. ఆట కంటే వయస్సునే పరిగణలోకి తీసుకున్నారని మరికొందరు ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
చెన్నై జట్టులో 30 ఏళ్లకు పైబడిన క్రికెటర్లు:
1. మహేంద్ర సింగ్ ధోనీ- 36 (రూ. 15 కోట్లు)
2. సురేష్ రైనా- 31 (రూ. 11 కోట్లు)
3. డ్వేన్ బ్రేవో- 34 (రూ 6.4 కోట్లు)
4. షేన్ వాట్సన్- 36 (రూ .4 కోట్లు)
5. కేదార్ జాధవ్- 32 (రూ .7.8 కోట్లు)
6. హర్భజన్ సింగ్ - 37 (2 కోట్లు)
7. అంబటి రాయుడు - 32 (రూ 2.2 కోట్లు)
8. ఇమ్రాన్ తాహిర్ - 38 (రూ. 1 కోట్లు)
9. డుప్లెసిస్- 33 (రూ. 1.6 కోట్లు)
10. మురళీ విజయ్-33 (రూ .2 కోట్లు)
11. కరణ్ శర్మ-30 (రూ .5 కోట్లు)