హైదరాబాద్: జనవరి 4న ముంబైలో జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే. ప్లేయర్ రిటెన్షన్ పద్ధతిలో భాగంగా కోహ్లీని తమ వద్దే అట్టిపెట్టుకున్నందుకు గాను ఆర్సీబీ ప్రాంఛైజీ కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లించింది.
అయితే జనవరి 27, 28 తేదీల్లో ఐపీఎల్ 2018 కోసం బెంగళూరులో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలం ప్రక్రియలో కోహ్లీ కంటే ఎక్కువ ధర అమ్ముడుపోయే ఆటగాళ్లు ఉన్నారని టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం సెహ్వాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ 'ఈ ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే వేలంలో ఇద్దరి నుంచి ముగ్గురు ఆటగాళ్లు కోహ్లీ కంటే ఎక్కువ ధర పలికేవాళ్లు ఉన్నారు. ఏదైనా ఫ్రాంఛైజీ ఒక ఆటగాడిని తామే దక్కించుకోవాలని భావిస్తే అతడి కోసం రూ.20కోట్లైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉంది' అని అన్నాడు.
'గతేడాది ముంబై ఇండియన్స్ వద్ద తగినంత డబ్బు లేక పోవడంతో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను వేలంలో కొనుగోలు చేయలేకపోయింది. దీంతో రైజింగ్ పూణె సూపర్జెయింట్స్ అత్యధికంగా రూ.14.5 కోట్లు వెచ్చించి స్టోక్స్ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది స్టోక్స్.. కోహ్లీ కంటే ఎక్కువ ధర పలకొచ్చు' అని సెహ్వాగ్ తెలిపాడు.
ఇక ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్ ద్వారా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకే ఒక్క ఆటగాడు అక్షర్ పటేల్కు అత్యధికంగా రూ.6.75కోట్లు చెల్లించింది. దీనిపై సెహ్వాగ్ మాట్లాడుతూ 'ఐపీఎల్లో భారత ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. మూడేళ్ల క్రితం అక్షర్ పటేల్ను రూ.30 లక్షలు వెచ్చించి మేము తీసుకున్నాం. అప్పుడు అతను భారత్కు ఆడటం లేదు. ఎప్పుడైతే పంజాబ్ జట్టులోకి వచ్చాడో అప్పటి నుంచి అతడు భారత్కు ఆడుతున్నాడు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
'ఈ ఏడాది జరిగే వేలానికి గనుక అతడిని వదిలేస్తే రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు పలకడం ఖాయం. ఒక మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లు వేయగలడు. అలాగే అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. రవీంద్ర జడేజా లాగా ఉపయోగకరమైన బ్యాట్స్మెన్. త్వరలో అతడు మంచి ఆల్రౌండర్ అవుతాడు' అని సెహ్వాగ్ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.