
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతుండటం సంతోషంగా ఉందని హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున 2010లో అంబటి రాయుడు అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున బరిలో దిగనున్నాడు. జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన రాయుడుని చెన్నై రూ. 2.20 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ 'చెన్నై తరఫున ఆడనుండటం సంతోషంగా ఉంది. ధోని కెప్టెన్సీలో చెన్నై లాంటి ఛాంపియన్తో జతకట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టు ప్రయోజనాల కోసం వంద శాతం కష్టపడటానికి నేను సిద్ధం. ప్రత్యేకంగా ఏదో ఓ స్థానంలో స్థిరపడాలనుకోవడం లేదు' అని అన్నాడు.
'జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆలోచించడం లేదు. దేశవాళీల్లో హైదరాబాద్ తరఫున రాణిస్తున్నా. ప్రస్తుతం నా దృష్టంతా చెన్నై జట్టుతో కలిసి ముందుకు సాగడం పైనే' అని అంబటి రాయుడు అన్నాడు. ముంబై, చెన్నై రెండు జట్లు కూడా అద్భుతమైన జట్లు అని, గెలవాలనే కసి ఏ జట్టు ప్రదర్శిస్తుందో ఆ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు.
చెన్నై నుంచి పంజాబ్కు వెళ్లిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని హర్భజన్ భర్తీ చేస్తాడనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు గాను 'భజ్జీ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. గతేడాది కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అతనో టాప్ క్లాస్ బౌలర్. అతన్ని మరొకరితో పోల్చడం సరికాదు' అని అన్నాడు. గత సీజనల్లో వీరిద్దరూ ముంబై ఇండియన్స్కు ఆడిన సంగతి తెలిసిందే.