
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండేళ్ల నిషేధం తర్వాత పదకొండవ సీజన్తో తిరిగి పునఃప్రవేశం చేస్తున్న చెన్నై సూపర్కింగ్స్ జట్టు తమ హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీపెన్ ఫ్లెమింగ్ను ఎంచుకుంది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాధ్ తెలిపారు.
చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాత మేనేజ్మెంట్నే తిరిగి తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జట్టు ప్రధాన కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కోచ్గా మైక్ హస్సీ కొనసాగుతారని, బౌలింగ్ కోచ్గా లక్ష్మీపతి బాలాజీలను నియమించినట్టు అధికారిక ప్రకటన చేశారు.
'చెన్నై జట్టుకు గతంలో కోచ్గా పని చేసిన ఫ్లెమింగ్నే తిరిగి ఎంచుకుంటున్నాం. ఇక బ్యాటింగ్ కోచ్గా ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ వ్యవహరించనున్నారు. బౌలింగ్ కోచ్గా భారత ఆటగాడు లక్ష్మిపతి బాలాజీ బాధ్యతలు నిర్వహించనున్నారు' అని తెలిపారు.
జనవరి 4న జరిగిన ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజాలను జట్టులో అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే జనవరి 27, 28 తేదీల్లో జరిగే ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టుకు ఆడిన ఆటగాళ్లనే వేలంలో కొనుగోలు చేస్తామని ధోని ఇప్పటికే ప్రకటించాడు.
ముఖ్యంగా లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ను ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని చెన్నై ప్రాంఛైజీ చూస్తోంది. దీంతో 27, 29తేదీల్లో జరిగే వేలంలో జట్టులో కొనసాగే ఆటగాళ్ల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత చెన్నై జట్టు ఐపీఎల్ ఆడుతుండటం... ధోనినే మళ్లీ కెప్టెన్గా ఉండటంతో చెన్నై అభిమానులు 11వ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు.