
హైదరాబాద్: టోర్నీల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో క్రికెటర్లు అక్కడ తమను ఎవరూ గుర్తుపట్టరని హాయిగా వీధుల్లో చక్కర్లు కొడుతుంటారు. షాపింగ్లకు వెళ్తుంటారు. ఆటోల్లో రైడ్లకు వెళ్తుంటారు. ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన ఓ విదేశీ ఆటగాడు తన భార్య, కుమారుడితో కలిసి ఇలాగే ఎంజాయ్ చేశాడు. అతను మరెవరో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్.
బుధవారం సొంతగడ్డపై చెన్నైతో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ 68 పరుగులు చేశాడు. చెన్నై ఆటగాళ్లు రాయుడు, ధోనీ రాణించడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఇదిలా ఉండగా గురువారం డివిలియర్స్కు తన భార్య, కుమారుడితో కలిసి బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అది కూడా ఆటోలో... ఆటోను పిలిపించుకుని భార్య, కుమారుడితో కలిసి తిరగడం మొదలు పెట్టాడు.
క్రికెట్ అభిమానులు డివిలియర్స్ను గుర్తుపట్టేశారు. అటుగా ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు డివిలియర్స్ వెళ్తున్న ఆటోను అనుసరించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం 'ఈ సారి కప్ మాదే' అంటూ సందడి చేశారు డివిలియర్స్తో పాటు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన బెంగళూరు రెండు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఐపీఎల్లో డివిలియర్స్ ఆరు ఇన్నింగ్స్ ఆడి 280పరుగులు చేశాడు. భారీ పరుగుల వరద పారిస్తోన్న చెన్నై జట్టు అంబటి రాయుడు కంటే కేవలం 3పరుగులు మాత్రమే తక్కువగా కొనసాగుతున్నాడు. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 29 ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ను ఢీకొట్టనుంది బెంగళూరు.