హైదరాబాద్: డెత్ ఓవర్లలో తమ జట్టు బౌలింగ్ మరింతగా మెరుగుపడాల్సి ఉందని కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అన్నాడు. డెత్ ఓవర్లలో తమ జట్టు బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని పాండే అభిప్రాయపడ్డాడు.
ఆదివారం రాత్రి వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చివరి 30 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన తరుణంలో కోల్కతా బౌలర్లు విఫలమవ్వడంతో ముంబయి అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో ముంబైపై మనీశ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ మరుగున పడిపోయింది.

గౌతం గంభీర్ (19), క్రిస్ లిన్ (32), రాబిన్ ఉతప్ప (4) పరుగులకే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే (81 నాటౌట్; 47 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులు) అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం పాండే మీడియాతో మాట్లాడాడు. 'గుజరాత్ లయన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ చివరి ఓవర్లలో మా బౌలర్లు లయ తప్పారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మరింత మెరుగుపడాల్సివుంది. బౌలర్లు క్రమం తప్పకుండా యార్కర్లు సంధిస్తే బ్యాట్స్ మన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. అయితే చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్ మన్ బాగా ఆడారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ పదును తేలడానికి మరింత కష్టపడాల్సివుంది. ఈ సమస్యను అధిగమిస్తాం' అని పాండే అన్నారు.