హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా రాణించకపోవడంపై ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సీజన్లో బెంగళూరు చెత్త ప్రదర్శన చేసినప్పటికీ అభిమానుల ఆదరణకు కోహ్లీ మరోసారి ట్విటర్ వేదికగా స్పందించాడు.
'ప్రస్తుత సీజన్లో అభిమానుల ప్రేమ, మద్దతు నిజంగా చాలా గొప్పది. వచ్చే సీజన్లో పుంజుకుని బలంగా తిరిగొస్తాం' అని ట్వీట్ చేస్తూ కోహ్లీ ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సీజన్లో బెంగళూరు ఆడిన 14 మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది.

దీంతో పది రోజుల క్రితం తమ స్థాయికి తగ్గట్టుగా రాణించనందుకు కోహ్లీ ట్విటర్ ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. గత సీజన్లో 16 మ్యాచ్లాడిన కోహ్లీ 973 పరుగులు సాధించగా ఈ సీజన్లో 10 మ్యాచ్లాడి 308 పరుగులు మాత్రమే చేశాడు.
అంతేకాదు ఐపీఎల్ పదో సీజన్లో బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.