హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ని పేలవంగా ఆరంభించినప్పటికీ, గెలుపుతో టోర్నీని ముగించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా సంతోషంగా కనిపించాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ (45 బంతుల్లో 58; 3×4, 3×6) రాణించడంతో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దాదాపు ఆరు వరుస ఓటముల తర్వాత బెంగళూరు ఈ విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సొంత మైదానం ఢిల్లీ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడేందుకు వచ్చిన కోహ్లీని చూసేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి (58: 45 బంతుల్లో 3x4, 3x6) అర్ధ సెంచరీ సాధించడంతో అతనికి 'స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని అందజేశారు. కోహ్లీ ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో అతనికి సమీపంలోని స్టాండ్స్లో ఉన్న అభిమానులు కోహ్లి.. కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ కనిపించారు.
మ్యాచ్ ముగిసినా కూడా వారు వెళ్లకుండా అలాగే కోహ్లి పేరును స్మరిస్తూనే ఉన్నారు. ఆ అభిమానానికి ముగ్ధుడైన విరాట్ కోహ్లీ తనకి అవార్డు రూపంలో వచ్చిన ట్రోఫీని వెంటనే ప్రకటనల హోర్డింగ్స్పై నుంచి జంప్ చేసి అభిమానుల వైపు విసిరేశాడు.