హైదరాబాద్: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చేస్తున్నాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయమై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. భుజం నొప్పి గాయం కారణంగా ఐపీఎల్లో తొలి మూడు మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దురంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే పూర్తి ఫిట్నెస్ సాధించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్గా శుక్రవారం ముంబైతో జరిగే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడని ఈ మేరకు కోహ్లీ ఫిట్నెస్ సాధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తన అధికారిక ట్విటర్లో పోస్టు చేశారు.
FAN ALERT - India Cricket Team and @RCBTweets captain @imVkohli declared match fit #RCB #IPL pic.twitter.com/4II7AACRdv
— IndianPremierLeague (@IPL) 13 April 2017
ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్ సందర్భంగా రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అయినా సరే రహానే నేతృత్వంలోని టీమిండియా ధర్మశాల టెస్టులో విజయం సాధించడంతో టెస్టు సిరిస్ను 2-1తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో '120 శాతం ఫిట్నెస్ ఉంటేనే ఐపీఎల్లో ఆడతాను' అని కోహ్లీ ఐపీఎల్ కు ముందు ప్రకటించాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫిటెనెస్ సాధించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్లో బెంగళూరు ఆడిన తొలి మూడు మ్యాచ్లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు.
తాజాగా విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిటెనెస్ సాధించాడు. జిమ్లో అలవోకగా బరువులను ఎత్తేస్తున్న వీడియోని సోషల్ మీడియా ద్వారా కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. 'మైదానంలో తిరిగి ఎప్పుడు అడుగు పెడతానా అని ఎదురుచూస్తున్నా. దాదాపుగా ఫిటెనెస్ సాధించేశాను. అన్నీ కుదిరితే మార్చి 14న (శుక్రవారం) మీ ముందుకు వస్తా' అంటూ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
ఈ క్రమంలో గురువారం బీసీసీఐ టీమిండియా కెప్టెన్, ఆర్బీసీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించాడని అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఏప్రిల్ 14న రాయల్ ఛాలెంజర్స్ తన సొంతమైదానం చిన్నస్వామిలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కి అందుబాటులోకి వచ్చేసినట్లు తెలిసిపోయింది.
బెంగళూరు ఫ్యాన్స్కు పండగ: 14న కోహ్లీ వచ్చేస్తున్నాడు (వీడియో)
అంతకుముందు బీసీసీఐ వైద్య సిబ్బంది కోహ్లీ ఫిట్నెస్ పరీక్షించి ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్కి అందుబాటులో ఉంటాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 14(శుక్రవారం) ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4గంటలకు ప్రారంభంకానుంది.
కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు బెంగళూరు జట్టు మూడు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. సోమవారం నాటి మ్యాచ్లో 360 డిగ్రీల ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫామ్లోకి రావడంతో ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఏబీకి తోడు కోహ్లీ కూడా బరిలోకి దిగుతుండటంతో బెంగళూరు అభిమానులకు పండగే.