హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేసిన ఓపెనింగ్ ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. కోల్కతా విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం గైర్హాజరీలో ఉండటంతో అతని స్థానంలో సునీల్ నరైన్ ఓపెనింగ్కు పంపారు.
171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా జట్టు ఓపెనర్గా గంభీర్తోపాటు సునీల్ నరైన్ను పంపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్లో కోల్కతా ఆడిన మొదటి మ్యాచ్లో క్రిస్ లిన్ ఓపెనర్గా బరిలో దిగాడు. అయితే అతడు గాయపడటంతో చివరి వరుస ఆటగాడైన నరైన్ గురువారం రాత్రి మ్యాచ్లో గంభీర్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు.

ఐపీఎల్లో తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన నరైన్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్గా రావడం ఇదే తొలిసారైనప్పటికీ సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఫోర్గా బాది తన ఉద్దేశాన్నినరైన్ చెప్పకనే చెప్పాడు. అంతేకాదు అభిమానులకు ఓ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు.
ముఖ్యంగా వరున్ అరోన్ వేసిన ఆరో ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లగా మలచిన నరైన్ ఆ తర్వాత బంతిని ఫోర్గా మలచిన తీరు అద్భుతం. అయితే ఆ మరుసటి బంతికి మరో హిట్ చేసే యత్నంలో నరైన్ అవుటయ్యాడు. దీంతో 18 బంతుల్లో ఎదుర్కొన్న నరేన్ 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
ఇక, పంజాబ్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో పంజాబ్పై కోల్కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.