హైదరాబాద్: తన లక్కీ ప్లేస్ హైదరాబాద్ అని భారత ఆల్ రౌండర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అన్నాడు. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2017 సీజన్ తొలి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యువరాజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తనకు ఎప్పుడూ లక్కీ ప్లేసేనని చెప్పాడు. ఇక్కడ అనేక పరుగులు సాధించానని చెప్పాడు. తమ జట్టులో బ్యాట్స్ మెన్, బౌలర్లు ఇద్దరూ బాగా రాణించారని తెలిపాడు. టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడం తన ఆట తీరుపై మంచి ప్రభావం చూపిందని చెప్పాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడానని అన్నాడు.

గత రెండేళ్లుగా బ్యాటింగ్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని, ఈ మ్యాచ్ లో తన ఆటతీరు సంతృప్తినిచ్చిందన్నారు. ఇదే జోరును కొనసాగించాల్సిన అవసరముందని యువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ కోసం నెట్స్ లో గంటలకొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు.
సొంతగడ్డపై జరిగే 7 మ్యాచ్ లలో 5 గెలిస్తే నాకౌట్ దశకు చేరుకునేందుకు ఉపయోపడుతుందని అన్నారు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో యువీ 27 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు.