హైదరాబాద్: రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ పదో సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించాడు. అందులో తన భార్య, కొడుకుతో కలిసి ఆరు రోజుల పాటు దుబాయ్ ట్రిప్కు వెళ్తున్నట్లు తెలిపాడు.
దీంతో ఈ సీజన్లో పూణె ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్లకు స్టీవ్ స్మిత్ దూరం కానున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు పూణె ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లోనే విజయం సాధించి... పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2016లో తొలిసారి అరంగేట్రం చేసిన పూణె జట్టుకు ధోని కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో పూణె జట్టు సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు ధోనిని తప్పించి అతడి స్ధానంలో స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించారు.
స్మిత్ దూరమైన నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతలను రహానే చేపట్టనున్నాడు. శనివారం (ఏప్రిల్ 22)వ తేదీన పూణె వేదికగా పూణె, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నిజానికి ఐపీఎల్ ప్రారంభానికి ముందు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించింది.
దీంతో సుదీర్ఘ కాలం పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మిత్ కొన్ని రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళ్తున్నాడు.