హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్గా ధోనీని తొలగిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జట్టు వ్యూహాలు రూపొందించే సమావేశాలకు గైర్హాజరవుతున్నాడని, కనీసం ఫోన్కి కూడా అందుబాటులో ఉండటం లేదనే కారణాలతో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా అప్పట్లో చెప్పారు.
అయితే సంజీవ్ గోయెంకా నిర్ణయం వెనుక రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నట్లు తాజాగా జాతీయ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గత సీజన్లో పూణె జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో పూణె పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది.

నిజానికి లీగ్ స్టేజీలో చాలా మ్యాచ్లు గెలిచేందుకు అవకాశం ఉన్నా ధోనీ బాధ్యతారాహిత్యం వల్ల కొన్ని మ్యాచ్ల్లో ఓటమి పాలైనట్లు ప్రాంఛైజీకి కోచ్ ఫ్లెమింగ్ గట్టిగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'ఐపీఎల్ -2016 సీజన్లో దాదాపు గెలవాల్సిన ఏడు మ్యాచ్ల్లో పుణె జట్టు ఓటమి చవిచూసింది. కెప్టెన్గా ఉన్న ధోనీ ఒత్తిడికి తలొగ్గి ఆ మ్యాచ్లని గెలుపుగా ముగించాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే అతడ్ని ఈ ఏడాది కెప్టెన్గా ఫ్రాంఛైజీ తొలగించింది' అని ఫ్లెమింగ్ చెప్పిన వార్త వెలుగులోకి వచ్చింది.
దీనిపై సర్వత్రా చర్చ జరగడంతో పూణె కోచ్ ప్లెమింగ్ ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. ఆ వార్తలన్నీ నిరాధారమని.. ఒత్తిడిలో సైతం ధోనీ గొప్ప ఫినిషరంటూ ట్విట్టర్లో ప్లెమింగ్ పేర్కొన్నాడు.