హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేయడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. రాబోయే రోజుల్లో ఇదే జోరుని కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు.
పంజాబ్ VS ముంబై మ్యాచ్ స్కోరుకార్డు
ఇండోర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్తో గురువారం జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ 2014లో రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ను గుర్తు చేసిందని చెప్పుకొచ్చాడు.
అప్పటి మ్యాచ్లో రాజస్ధాన్ జట్టుపై 190 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే ఛేదించామని ఈ సందర్భంగా రోహిత్ శర్మ గుర్తు చేశాడు. పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో ఛేదించడం నిజంగా అద్భుతమని కొనియాడాడు.
ఓపెనర్లు పార్థీవ్ పటేల్, జోస్ బట్లర్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారని కొనియాడాడు. పార్థీవ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాడని, భారీ లక్ష్యాన్ని చేధించడానికి తమకు శుభారంభం లభించిందని చెప్పాడు. బట్లర్ ఆటపై పూర్తి సంతృప్తితో ఉన్నానని అన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ హషీం ఆమ్లా(60 బంతుల్లో 104 నాటౌట్)పై కూడా రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. పంజాబ్ ఆటగాళ్లు ఆమ్లా, మ్యాక్స్ వెల్ ఇద్దరూ బాగా అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు.
ఐపీఎల్ 10: రెండో సెంచరీ, పంజాబ్ Vs ముంబై మ్యాచ్ హైలెట్స్
ఇక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న జోస్ బట్లర్ మాట్లాడుతూ ముంబై విజయంతో తన వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం గర్వంగా ఉందని, బరిలోకి దిగినప్పుడు ఒత్తిడికి గురయ్యానని, తాము గెలవడంతో సంతోషంగా ఉందని చెప్పాడు.