హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్లో మాత్రం ఆరంభ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్కు పెట్టింది పేరుగా ఉన్న ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపెడుతూ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
గురువారం పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. చివరి మూడు ఓవర్లలో పూణె విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో నాన్ కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న ధోనీ (12 నాటౌట్) నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు.
దీంతో 18, 19 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్లో పూణె విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. తొలి మూడు బంతుల్లో పొలార్డ్ మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. క్రీజులో ధోని, స్మిత్ ఉన్నారు.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ తర్వాతి రెండు బంతులను రెండు సిక్సులుగా మలిచి పూణెకు స్మిత్ విజయాన్ని అందించాడు. దీంతో స్మిత్పై హర్ష గొయంకా ప్రశంసలు కురిపించాడు. స్మిత్ను ధోనితో పోలుస్తూ చేసిన ఈ ప్రశంసలు ధోనిని కించపరిచేలా ఉండటంతో గోయంకా తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.
ధోనిని కించపరుస్తూ హర్ష గోయాంకా చేసిన ట్వీట్ పట్ల ఎట్టకేలకు వివరణ ఇచ్చాడు. ధోని ఒక గొప్ప బ్యాట్స్ మెన్ అని అయితే ఈరోజు స్మిత్ డే అంటూ ధోని అభిమానులను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆ ట్వీట్ను డిలీట్ చేశాడు.