హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 18) రాత్రి రాజ్ కోట్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో బెంగళూరుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

గాయం కారణంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ సందేశాన్ని పోస్టు చేశాడు. మంగళవారం వాటి మ్యాచ్కు తాను అందుబాటులో ఉండటం లేదని అందులో పేర్కొన్నాడు.
'గాయం కారణంగా ఈరోజు జరిగే మ్యాచ్కి అందుబాటులో ఉండటం లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు గుడ్ లక్' అంటూ ఏబీ ట్విట్టర్ పేజిలో రాసుకొచ్చాడు. ఈ సీజన్లో ఐదు మ్యాచ్లాడిన బెంగళూరు ఒక్క మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉంది.
33 ఏళ్ల ఏబీ డివిలియర్స్ గాయం కారణంగా ఈ సీజన్లో మొదటి రెండు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10వ తేదీన ఇండోర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన డివిలియర్స్ 89 నాటౌట్తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 19, రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగులు చేశాడు. ఐపీఎల్ పదో సీజన్లో బెంగళూరు ఆటగాళ్లు పలువురు గాయల బారిన పడ్డారు. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భుజం నొప్పి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే.