హైదరాబాద్: మధ్యప్రదేశ్ క్రికెటర్ హర్ప్రీత్ సింగ్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒప్పందం కుదుర్చుకొంది. ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్లో గాయపడిన సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో హర్ప్రీత్ను జట్టులోకి తీసుకుంది. హర్ప్రీత్ సింగ్ గతంలో పూణె వారియర్స్కు ఆడాడు.
దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో సెంట్రల్ జోన్ తరుపున ఆడిన హర్ప్రీత్ సింగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ఇంటర్ జోనల్ టోర్నీ 2016-17లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించినప్పటికీ, అతడిని ప్రాంఛైజీలు కోనుగోలు చేయకపోవడం వెనుక పోలీసు కేసు తీవ్ర ప్రభావం చూపించింది.

ఫిబ్రవరి 20వ తేదీన ఐపీఎల్ వేలం జరిగిన రోజు ఒక యువ క్రికెటర్ తప్పతాగి ముంబై రైల్వే ప్లాట్ఫాంపైకి కారును తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ముఖ్య కారకుడు ముంబైకి చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ సింగ్ కాగా, మీడియా మాత్రం మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ హర్ప్రీత్ సింగ్ ఫోటోను చూపించారు.
దీంతో మీడియా అత్యుత్సాహం వల్లే తనకు ఐపీఎల్ అవకాశం దెబ్బ తీసిందంటూ హర్ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తాజాగా గాయపడిన సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో బెంగళూరు జట్టు హర్ప్రీత్ను తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.