హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్లో కోల్కతా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్లో కోల్కతాపై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అమీతుమీ పోరులో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరోసారి తమదే పైచేయిగా నిరూపించుకుంది.

తొలి క్వాలిఫయర్లో ముంబై ఓటమి పాలైనప్పటికీ, క్వాలిఫయర్-2లో మాత్రం ఆకట్టుకుని ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. 108 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ముంబై ఆదిలోనే సిమన్స్(3), పార్ధీవ్ పటేల్(14), అంబటి రాయుడు(6) వికెట్లను కోల్పోయి తడబడింది.
అయితే రోహిత్ శర్మ(26), ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 45 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్స్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
ముంబై విజయ లక్ష్యం 108
బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న క్వాలిఫియర్-1 మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 18.5 ఓవర్లకు 107 పరుగులు చేసి ఆలౌటయ్యారు.
దీంతో ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 108 పరుగులుగా నిర్దేశించింది. కోల్కతా ఓపెనర్లు క్రిస్లిన్(4), నరైన్(10) నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(1), గంభీర్(), గ్రాండ్ హోమ్ డకౌట్గా వెనుదిరగడంతో కోల్కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇషాంక్ జగ్గి(28), సూర్య కుమార్ యాదవ్(31)లు కాస్త ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి జోడీ 56 పరుగులు జోడించడంతో కోల్కతా వంద పరుగుల మైలురాయిని అందుకుంది. జగ్గి ఏడో ఆరో వికెట్గా అవుటైన తరువాత కోల్కతా వరుసగా వికెట్లను కోల్పోయింది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు, జస్ప్రిత్ బుమ్రా మూడు, మిచెల్ జాన్సన్ రెండు, మలింగ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ పదో సీజన్లో టైటిల్ పోరుకు ముందు జరిగే క్వాలిఫయిర్-2 మ్యాచ్ ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఐపీఎల్ మాజీ విజేతలైన ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ గాయమైన మెక్లెంగన్ ప్లేస్లో మిచెల్ జాన్సన్ జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు. కోల్కతా కెప్టెన్ గంభీర్ మాట్లాడుతూ యూసఫ్ పఠాన్ స్థానంలో అంకిత్ రాజ్పుత్, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కొలిన్ డి గ్రాండ్హోమ్ జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు.

లీగ్ దశలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా నైట్ రైడర్స్ భావిస్తుండగా.. ఆ జట్టుపై తిరుగులేని రికార్డును నిలబెట్టుకోవాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది. ఇరు జట్లు రెండేసి టైటిళ్లతో అద్భుతమైన ఐపీఎల్ రికార్డును కలిగి ఉన్నాయి.
ఇక లీగ్ దశలో ముంబై, కోల్కతా రెండు సార్లు తలపడగా రెండింట్లోనూ ముంబై పైచేయి సాధించింది. అయినప్పటికీ కోల్కతాను అంత తేలిగ్గా తీసిపారేయలేమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం అన్ని సీజన్లలో కలుపుకుని మొత్తం 20 మ్యాచుల్లో ఈ రెండు జట్లు తలపడగా.. ముంబై 15 మ్యాచుల్లో గెలిచింది.
ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్స్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో తలపడనుంది.
జట్ల వివరాలు
ముంబై ఇండియన్స్: లెండిల్ సిమ్మన్స్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), అంబటి రాయుడు, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, కరణ్ శర్మ, మిచెల్ జాన్సన్, జాస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.
కోల్కతా నైట్రైడర్స్: క్రిస్ లిన్, సునీల్ నరైన్, గౌతమ్ గంభీర్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప(వికెట్ కీపర్), ఇషాంక్ జగ్గీ, సూర్యకుమార్ యాదవ్, కొలిన్ డి గ్రాండ్హోమ్, నాథన్ కౌల్టర్ నైల్, పియూష్ చావ్లా, ఉమేశ్ యాదవ్, అంకిత్ రాజ్పుత్.