హైదరాబాద్: ప్రతి ఐపీఎల్ సీజన్కు ముందు ఫిబ్రవరి మొదటి వారంలో ఆటగాళ్ల వేలం నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలం మాత్రం ఆలస్యం అవుతోంది. బెంగళూరు వేదికగా ఈనెల 20న ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలంలో 28 మంది విదేశీ ఆటగాళ్లతో కలిపి 76 మంది క్రికెటర్లు ఈసారి వేలంలో అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు 750 మంది ఆటగాల్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ప్రస్తుతం 44 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 140 మంది ఆటగాళ్లు ఆయా జట్లతో కొనసాగుతున్నారు. గత సీజన్ తర్వాత ఫ్రాంఛైజీలన్నీ కలిపి 63 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. ఎనిమిది ఫ్రాంఛైజీలకు కలిపి మిగులు మొత్తం రూ. 143.33 కోట్లు ఉంది. మిగతా ప్రాంఛైజీలతో పోలిస్తే గరిష్టంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద రూ. 23.35 కోట్లు ఉన్నాయి.
బెంగుళూరులోని రిడ్జ్ కాల్టన్లో వేలం ముగిసిన తర్వాతి రోజు ఐపీఎల్ విధివిధానాలపై ఫ్రాంఛైజీలకు వర్క్ షాప్ నిర్వహిస్తారు. వాస్తవానికి ఐపీఎల్ వేలం ఈనెల 4న జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శిలపై వేటు, జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీంకోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఐపీఎల్ వేదికను సైతం బెంగుళూరు నుంచి ముంబైకి మారుస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫిబ్రవరి 20న ఐపీఎల్ వేలం ఉంటుందని అది కూడా బెంగళూరులోనేనని బీసీసీఐ శుక్రవారం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 5న మొదలై మే 21న ముగుస్తుంది.