హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి.
బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో ఈ మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్ జరిగే చిన్నస్వామి మైదానం చుట్టుపక్కల మధ్యాహ్నం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. మధ్య మధ్యలో వరుణుడు విరామం ఇస్తున్నప్పటికీ చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయిర్-2లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఐపీఎల్ పదో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్కి ఎలాంటి రిజర్వ్ డే లేదు. కాబట్టి.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు.
టోర్నీ లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్ల్లో గెలుపొంది.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో బెంగళూరుతో కలిసి పాయింట్ పంచుకుని 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు 8 విజయాలు మాత్రమే సాధించిన కోల్కతా 16 పాయింట్లో నాలుగో స్థానంలో నిలిచింది.

కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలుస్తుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2లో ముంబైతో తలపడుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.