హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్స్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు శుభవార్త. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కీలక బౌలర్ వస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ముస్తఫిజుర్ రెహ్మాన్ వస్తున్నాడు.
బంగ్లాదేశ్కు చెందిన మీడియం పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. ఈ విషయాన్ని అతను తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు. తాను ఇండియాకు బయల్దేరానని మంగళవారం ముంబైకి చేరుకుంటానని అందులో పేర్కొన్నాడు.

గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో ముస్తఫిజుర్ కీలకపాత్ర పోషించాడు. బుధవారం హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కి ముస్తఫిజుర్ జట్టుకు అందుబాటులో ఉండే అవకాశముందని కోచ్ టామ్ మూడీ పేర్కొన్నాడు.
ఇటీవలే ముగిసిన శ్రీలంక పర్యటనలో ముస్తఫిజుర్ 18 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. లంక పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టీ20ల్లో ముస్తఫిజుర్ రాణించాడు. చివరి టీ20లో ముస్తఫిజుర్ తీసిన నాలుగు వికెట్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. తద్వారా రెండు టీ20ల సిరిస్ సమమైంది.