హైదరాబాద్: సమీకరణాల సంక్లిష్టత లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకునే మంచి అవకాశాన్ని కోల్కతా జారవిడుచుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో కోల్కతాపై విజయం సాధించింది. దీంతో 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది.
టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. రాయుడు (37 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌరభ్ తివారి (43 బంతుల్లో 52; 9 ఫోర్లు) రాణించారు. ఆ తర్వాత కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులకే పరిమితమైంది.

మనీష్ పాండే (33 బంతుల్లో 33; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్రిస్ లిన్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) గంభీర్ (21) రెండో వికెట్కు 41 పరుగులు జోడించారు. ఐదో ఓవర్ నుంచి వరుసగా 3 వికెట్లు కోల్పోవడంతో కోల్కతా 4 వికెట్లకు 53 పరుగులే చేసింది.
ఏడో ఓవర్లో రెండు సిక్సర్లతో 17 పరుగులు రాబట్టిన పఠాన్(20) తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. మనీష్ నిలకడగా ఆడి యూసుఫ్తో ఐదో వికెట్కు 34, గ్రాండ్హోమీ (29)తో ఆరో వికెట్కు 41, కుల్దీప్ (16)తో ఏడో వికెట్కు 21 పరుగులు జోడించి అవుటయ్యాడు.
12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో కుల్దీప్ అవుట్ కావడంతో ఉమేశ్ (4 నాటౌట్), బౌల్ట్ (5 నాటౌట్) లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ మ్యాచ్లో రాణించిన అంబటి రాయుడుకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించేందుకు ఈ మ్యాచ్ ముంబైకి బాగా పనికొచ్చింది.
ఇన్నింగ్స్ ప్రారంభించిన తివారి మెరుగ్గా ఆడినా.. రెండో ఓపెనర్ సిమ్మన్స్ (0) విఫలమయ్యాడు. రోహిత్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో పవర్ప్లేలో ముంబైకి 51 పరుగులు సాధించింది. రెండో వికెట్కు 57 పరుగుల జత చేశాకా రోహిత్ వెనుదిరిగినా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన అంబటి రాయుడు చెలరేగిపోయాడు.
దీంతో 13.1 ఓవర్లలో రోహిత్సేన 100 పరుగులకు చేరుకుంది. 42 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన తివారి 16వ ఓవర్లో అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఉమేశ్, కుల్దీప్, బౌల్ట్ ఓవర్లలో మూడు భారీ సిక్సర్లు బాదిన రాయుడు 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.
టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా శనివారం కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ పీల్డింగ్ ఎంచుకున్నాడు.
గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ స్థానంలో ట్రేంట్ బోల్ట్కు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ముంబై ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్కతాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ మ్యాచ్ ఫలితంపై ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఒక వేళ కోల్కతా ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ జట్టు పూణెపై గెలిస్తే మూడు జట్లు 16 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం కానుంది. ఈడెన్లో వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 13 మ్యాచ్ల్లో తొమ్మిదింట విజయం సాధించిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక కోల్కతా 16 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఈ సీజన్లో ఇరు జట్లు ఒక సారి తలపడగా ముంబై విజయం సాధించింది. దీంతో కోల్కతా ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది.