హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో వాంఖడె వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చుక్కలు చూపించింది. పదో సీజన్లో తన ప్రత్యర్థి జట్లను ధాటిగా ఎదుర్కొన్న ముంబై గురువారం పంజాబ్ బ్యాట్స్మెన్ను దూకుడుని అడ్డుకోలేకపోయింది.
ముంబై పేలవ బౌలింగ్ను అవకాశంగా మల్చుకున్న పంజాబ్ జట్టు భారీ స్కోరు చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93నాటౌట్; 11×4, 3×6), మాక్స్వెల్(21 బంతుల్లో 47; 2×4, 5×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహాలు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు సాధించారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది.
మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్, సాహాతో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్లు బాది 21 పరుగులు రాబట్టారు.
ఈ దశలో చెలరేగి ఆడుతున్న మ్యాక్స్వెల్... బుమ్రా బౌలింగ్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన షాన్ మార్ష్తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ సమయంలో భారీ షాట్కు ప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ రూపంలో మూడో వికెట్గా వెనుదిరిగాడు. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు 230 చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.
ముంబై Vs పంజాబ్ మ్యాచ్ హైలెట్స్:
* 8 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి పంజాబ్ 100 పరుగులు చేసింది.
* 18 బంతుల్లో 36 పరుగులు చేసిన మార్టిన్ గుప్తిల్ పంజాబ్ తొలి వికెట్గా వెనుదిరిగాడు.
* సాహా, గుప్తిల్ తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఐపీఎల్లో 8 ఓవర్లకే 100 పరుగులు చేయడం ఇది పదోసారి.
* ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సాహా 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో సాహాకు ఇది తొలి అర్ధ సెంచరీ.
* సాహా 55 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
* 21 బంతుల్లో 47 పరుగులు చేసిన కెప్టెన్ మ్యాక్స్ వెల్... బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
* రెండో వికెట్ కు సాహా, మ్యాక్స్ వెల్ ఇద్దరూ కలిసి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఐపీఎల్ పదో సీజన్లో 230 పరుగులు అత్యధిక స్కోరు. ఈ సీజన్లో దీనికి ముందు 214 అత్యధిక స్కోరుగా నమోదైంది.
* ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మూడో అత్యధిక స్కోరు ఇది.
* ఐపీఎల్ చరిత్రలో వాంఖడె స్టేడియంలో రెండో అత్యధిక స్కోరు నమోదైంది.
* మెక్లిన్ గన్ 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు.
* హార్ధిక్ పాండ్యా 2 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు.
* ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు వైడ్స్, నో బాల్స్, బైల రూపంలో మొత్తం 10 ఎక్స్ ట్రా పరుగులిచ్చారు.