హైదరాబాద్: సొంతగడ్డపై మరోసారి తిరుగులేదని సన్ రైజర్స్ నిరూపించుకుంది. బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్ వికెట్ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్ శిఖర్ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్), హెన్రిక్స్(44 పరుగులు) సన్రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ముంబై బౌలర్లలో మలింగ, బుమ్రా, క్లెనగన్లకు తలో వికెట్ దక్కింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ విజయ లక్ష్యాన్ని 139 పరుగులుగా నిర్దేశించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 67) అర్ధ సెంచరీతో రాణించాడు.
అద్భుతమైన ఫామ్లో ఉన్న సిమన్స్(1)ని ఆదిలోనే పెవిలియన్కి పంపి హైదరాబాద్కి చక్కటి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (9)తో పాటు నిలకడగా ఆడిన మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (17 బంతుల్లో 23) కూడా పది పరుగుల వ్యవధిలోనే అవుటయ్యాడు.
దీంతో ముంబై ఇండియన్స్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్య (15: 24 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ని నిర్మించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ నాలుగో వికెట్కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయితే క్రీజులో తడబడుతున్న హార్దిక్ పాండ్యాని స్పిన్నర్ రషీద్ ఖాన్ బుట్టలో వేయగా.. అనంతరం వచ్చిన పొలార్డ్ (5), కర్ణ్ శర్మ (5) చివర్లో భారీ షాట్ల కోసం ప్రయత్నిస్తూ వరుసగా అవుట్ కావడంతో ముంబై 138 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ కౌల్ మూడు, భువనేశ్వర్ రెండు, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
హైదరాబాద్ Vs ముంబై మ్యాచ్ హైలెట్స్:
* నబీ వేసిన తొలి ఓవర్లోనే లెండి సిమ్మన్స్ పెవిలియన్కు చేరాడు.
* 9 పరుగుల వద్ద నితీశ్ రాణా రెండో వికెట్గా వెనుదిరిగాడు.
* 8 ఓవర్లలోపే నబీ తన 4 ఓవర్లను పూర్తి చేసి 13 పరుగులిచ్చాడు.
* సన్ రైజర్స్ తరుపున నబీ, రషీద్ ఖాన్ ఆడిన రెండో ఐపీఎల్ మ్యాచ్.
* 34 బంతుల్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. మొత్తంగా 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
* ముంబై జట్టులో రోహిత్ శర్మ తర్వాత పార్దీవ్ పటేల్ అత్యధికంగా 23 పరుగులు చేశాడు.
* భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 29 పరుగులు సమర్పించుకున్నాడు.
* సన్ రైజర్స్ బౌలర్ సిద్ధార్ద్ కౌల్ 3 వికెట్లు తీసి 24 పరుగులు సమర్పించుకున్నాడు.