హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ హషీం ఆమ్లా గుర్తింపు పొందాడు. ఇండోర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 ఫోర్లు) సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు కోల్పోయి పంజాబ్ 198 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ఓపెనర్లు ఆమ్లా, షాన్మార్ష్ (26: 21 బంతుల్లో 5×4) మంచి శుభారంభం అందించారు. వికెట్లను కాపాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో షాన్ మార్ష్(26) తొలి వికెట్ గా అవుట్ కావడంతో కింగ్స్ స్కోరు బోర్డు నెమ్మదించింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా(11) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కృనాల్ పాండ్య బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన మాక్స్వెల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మెక్లనగన్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా 6,6,4,4,6 బాది ఏకంగా 28 పరుగులు రాబట్టాడు.
ఆ తర్వాతి ఓవర్లో ఆమ్లా చెలరేగాడు. మలింగ వేసిన రెండో బంతిని స్టేడియం బయటకు పంపిన ఆమ్లా.. ఆ ఓవర్లో 22 పరుగులురాబట్టాడు. చివరికి బుమ్రా బౌలింగ్లో మాక్స్వెల్ ఔటవడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోనిస్(1) అవుటైనప్పటికీ ఆమ్లా తన జోరు తగ్గించలేదు.
ఇక చివరి ఓవర్ లో ఆమ్లా రెండు సిక్సర్లు సాధించడంతో కింగ్స్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్కు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
పంజాబ్ Vs ముంబై మ్యాచ్ హైలెట్స్:
* 3 పరుగుల వద్ద ఆమ్లాకి నితీశ్ రాణా క్యాచ్ మిస్ రూపంలో లైఫ్ వచ్చింది.
* ఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై షాన్ మార్ష్ 500 పరుగులు పూర్తి చేశాడు. సురేశ్ రైనా (707), ధోని(524)ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్ మెన్.
* పంజాబ్ ఓపెనర్లు షాన్ మార్ష్, ఆమ్లాలు తొలి వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన వృద్ధిమాన్ సాహా 11 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
* ముంబై బౌలర్ మిచెల్ మెక్లనగన్ వేసిన ఓవర్లో పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగులు రాబట్టాడు.
* 15, 16 ఓవర్లు కలిపి పంజాబ్ యావరేజిగా 50 పరుగులు సాధించింది.
* ముంబై బౌలర్ లసిత్ మలింగ ఓవర్లలో ఆమ్లా 51 పరుగులు సాధించాడు.
* 58 బంతుల్లో 8 ఫోర్లు, 6 ఫోర్ల సాయంతో హషీం ఆమ్లా టీ20 సెంచరీని సాధించాడు.
* ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన మలింగ 58 పరుగులిచ్చాడు. ఎకానమీ పరంగా మలింగ చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.