హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్కతా జట్టు ఓపెనర్గా గంభీర్తోపాటు సునీల్ నరైన్ను పంపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సీజన్లో కోల్కతా ఆడిన మొదటి మ్యాచ్లో క్రిస్ లిన్ ఓపెనర్గా బరిలో దిగాడు. అయితే అతడు గాయపడటంతో చివరి వరుస ఆటగాడైన నరైన్ గురువారం రాత్రి మ్యాచ్లో గంభీర్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఐపీఎల్లో తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన నరైన్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.
ఓపెనర్గా రావడం ఇదే తొలిసారైనప్పటికీ సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఫోర్గా బాది తన ఉద్దేశాన్నినరైన్ చెప్పకనే చెప్పాడు. అంతేకాదు అభిమానులకు ఓ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 18 బంతుల్లో ఎదుర్కొన్న నరేన్ 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
ఇక కోల్కతా కెప్టెన్ గౌతం గంభీర్ మరో అర్ధ సెంచరీ (49 బంతుల్లో 72 నాటౌట్: 11 ఫోర్లు)తో అద్భుత ఇన్నింగ్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాబిన్ ఊతప్ప (26), మనీశ్ పాండే (16 బంతుల్లో 25 నాటౌట్)గా నిలిచాడు.
కోల్ కతా విజయ లక్ష్యం 171
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాజ్, కోల్ కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో కోల్కతా విజయ లక్ష్యం 171గా నిర్దేశించింది.ఓపెనర్లు మనన్ వోహ్రా (28), ఆమ్లా (25) పంజాబ్కు మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది.
ఈ సమయంలో కోల్కతా స్పిన్నర్ పియూష్ చావ్లా తన తొలి ఓవర్ మొదటి బంతికే వోహ్రాను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోనిస్ (9) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ మాక్స్వెల్ (25: 14 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు), డేవిడ్ మిల్లర్ (19బంతుల్లో 28, 4 ఫోర్లు, 2 సిక్సులు) భారీ భాగస్వామ్యం దిశగా సాగారు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో మాక్స్వెల్ అవుట్ కావడంతో పంజాబ్ స్కోరు బోర్డు మందగించింది.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్తో పాటు వృద్ధిమాన్ సాహా(25) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి కలిసి 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ 155 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఇక చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు రావడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
కోల్కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ నాలుగు, క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీసుకుని అద్భుత ప్రదర్శన చేశారు. సునీల్ నరైన్, పియూష్ చావ్లా, గ్రాండ్హోం తలో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్ 10వ సీజన్లో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల కన్నా లక్ష్య ఛేదనకు దిగిన జట్లే ఎక్కువ సార్లు విజయం సాధించాయి.
ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. కుల్దీప్ యాదవ్ స్థానంలో పియూశ్ చావ్లా, రాజ్పుత్ స్థానంలో ఉమేశ్ యాదవ్తో పాటు గ్రాండ్హోమ్ను కూడా తుది జట్టుకు ఎంపిక చేసినట్లు గంభీర్ పేర్కొన్నాడు.
మరోవైపు దేశవాళీ ఆటగాడు నటరాజన్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్ తెలిపాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్లో పంజాబ్పై కోల్కతాకే మెరుగైన రికార్డే ఉంది. ముఖాముఖి పోరులో రెండు జట్లు 19 సార్లు తలపడగా 13సార్లు కోల్కతానే విజయం సాధించింది.
ఇక గురువారం మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్లోనూ పంజాబ్పై కోల్కతాకే మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు ఈడెన్ గార్డెన్స్లో తలపడగా ఆరు సార్లు కోల్కతా విజయం సాధించింది. గురువారం నాటి మ్యాచ్లో కోల్కతా అరుదైన రికార్డుని సమం చేసే అవకాశం ఉంది.
ఐపీఎల్లో ఒక జట్టుపై వరుసగా ఏడు అంతకన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఢిల్లీ డేర్ డెవిల్స్పై బెంగళూరు వరుసగా ఎనిమిది విజయాలు సాధించి అరుదైన రికార్డును సృష్టించింది. గురువారం నాటి మ్యాచ్లో పంజాబ్పై కోల్ కతా విజయం సాధిస్తే బెంగళూరు సృష్టించిన రికార్డును సమం చేస్తుంది.
కోల్కతా: గౌతం గంభీర్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, కోలిన్ డి గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్, ఉమేశ్ యాదవ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: గ్లెన్ మ్యాక్స్ వెల్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, అక్షర్ పటేల్, మనన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, స్టోనిస్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ, ఇషాంత్ శర్మ, వరుణ్ అరోన్