హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలవడానికి కెప్టెన్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ చెత్త ప్రదర్శన ఒక కారణం కాగా, కేఎల్ రాహుల్ గైర్హాజరీ కూడా మరో కారణమని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనపై పాంటింగ్ విశ్లేషించాడు. ఫామ్లో ఉన్న ఓ కీలక ఆటగాడు బెంగళూరుకి అందుబాటులో లేకుండా పోవడం ఆ జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పాంటింగ్ పేర్కొన్నాడు.
'రాహుల్ లేకపోవడం బెంగళూరుకి భారీ నష్టం చేసింది. గతేడాది బెంగళూరు ఫైనల్కు చేరడంలో రాహుల్ పాత్ర వెలకట్టలేనిది. ఈసారి టాపార్డర్లో రాహుల్ లేకపోవడం బెంగళూరు తడబడింది. గడిచిన ఐపీఎల్ ప్రదర్శన ఇక్కడ ప్రస్తుతానికి అనవసరం. అయితే ఐపీఎల్ ఆరంభమయ్యే వరకూ రాహుల్ అద్భుతమైన ఫామ్లో ఉండటం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి' అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ పదో సీజన్లో కేఎల్ రాహుల్ లేకపోవడం నిజంగా ఆ జట్టు దురదృష్టమని పాంటింగ్ చెప్పాడు. భుజం గాయంతో ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్లో కేఎల్ రాహుల్ భుజానికి గాయమైంది.
దీంతో ఐపీఎల్ నుంచి రాహుల్ తప్పుకున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా సిరిస్ ముగిసిన తర్వాత లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే ఈ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఈ ఏడాది జూన్ 1 నుంచి 18 వరకు లండన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.