హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్లో భాగంగా శుక్రవారం గుజరాత్ లయన్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు.
చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా చూస్తామని గంభీర్ పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో కుల్దీప్ నాలుగు వికెట్లు తీసుకుని టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్లో కోల్ కతా జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న కుల్దీప్ యాదవ్పై ఒత్తిడి ఉంటుందన్న ప్రశ్నకు గంభీర్ స్పందించాడు.
'కుల్దీప్ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. తనపై ఒత్తిడి పెంచుకూడదని అనుకుంటున్నాం. అయితే జట్టులోని మిగతా బౌలర్లు ఆ ఒత్తిడిని షేర్ చేసుకుంటారు. అతడు ఆటను ఆస్వాదించేలా ఉండే చాలు. అతడు స్వేచ్ఛగా బౌలింగ్ వేయాలని కోరుకుంటున్నాం. జట్టులోని ఎటాకింగ్ బౌలర్లలో అతడు ఒకడు. మాకు అతడు మ్యాచ్ విన్నర్' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఉమేశ్ యాదవ్ గాయంపై కూడా గంభీర్ స్పందించాడు. ఉమేశ్ జట్టులో ఉండటం జట్టుకు సానుకూల అంశమని, అయితే అతడి స్ధానంలో మరొకరికి అవకాశం రావడం మంచిదేనని గంభీర్ అన్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్కి ఉమేశ్ అందుబాటులో ఉంటాడని గంభీర్ అన్నాడు. ఉమేశ్ ఫిట్ నెస్పై ఎటువంటి సందేహం లేదని చెప్పాడు. రాజ్ కోట్ పిచ్పై గంభీర్ సంతృప్తిని వ్యక్తం చేశాడు.