హైదరాబాద్: అంగరంగ వైభవంగా ఏప్రిల్ 5న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయినప్పటికీ ఇంకా కొన్ని జట్లకు సంబంధించి ఆటగాళ్లు గాయాలు పాలవుతూనే ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 10వ సీజన్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ స్థానంలో కొలిన్ డి గ్రాండ్హోమ్ను జట్టులోకి తీసుకుంటున్నట్టు కేకేఆర్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది.
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆండ్రూ రస్సెల్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, న్యూజిలాండ్కు చెందిన గ్రాండ్హోమ్ 6 టెస్ట్లు, 9 వన్డేలు, 8 టీ20 మ్యాచ్లు ఆడాడు. గతేడాది నవంబర్లో పాకిస్థాన్తో అరంగేట్రం టెస్టులో 7 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇదిలా ఉంటే రాజ్కోట్లోని ఎస్సీఏ స్టేడియంలో ఏప్రిల్ 7వ తేదీన గుజరాత్ లయన్స్ జట్టుతో కోల్ కతా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు విభిన్నంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
టోర్నీ మొదలై 10 ఏళ్లు కావడంతో ప్రత్యేకంగా ఎనిమిది ప్రదేశాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, మొహాలీ, ముంబై, పుణె, రాజ్కోట్లో ఈ వేడుకలు జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.