హైదరాబాద్: 'నాకు మాత్రమే గుడ్ ఫ్రైడే, బెంగళూరు జట్టుకు కాదు' అని ఐపీఎల్ పదో సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన బెంగళూరు లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ చెప్పాడు. ఐపీఎల్లో భాగంగా శుక్రవారం బెంగళూరు-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో శామ్యూల్ బద్రీ సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ పదో సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బద్రీ వేసిన మూడో ఓవర్ తొలి బంతిని పార్థీవ్ పటేల్ డిఫెన్స్ ఆడాడు. ఇక రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేశాడు.
ఫుల్టాస్గా వేసిన మూడో బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన మెక్లీన్ గన్ (0) భారీ షాట్ ఆడాడు. లాంగాన్లో ఉన్న మన్దీప్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఇక నాలుగో బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు.
దీంతో ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ వికెట్ నమోదు చేసిన బౌలర్గా బద్రీ రికార్డు సృష్టించాడు. మ్యాచ్ అనంతరం బద్రీ మీడియాతో మాట్లాడాడు. తమ జట్టు మరిన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
'అవును. హ్యాట్రిక్ సాధించినందుకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం, నాకు మాత్రమే గుడ్ఫ్రైడే, బెంగళూరు జట్టుకు కాదు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీతో తమ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. అయినా సరే అనుకున్నన్ని పరుగులు చేయలేకపోయాం' అని బద్రీ అన్నాడు.
ఐపీఎల్ 10లో తొలి హ్యాట్రిక్: బెంగళూరు Vs ముంబై మ్యాచ్ హైలెట్స్
'ఈ పిచ్పై 142 చాలా తక్కువ స్కోరు. 160-170 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. ముంబై ఆటగాళ్లు పొలార్డ్, కృనాల్ అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మను అవుట్ చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. అతను స్పిన్ను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడతాడని తెలుసు' అని చెప్పుకొచ్చాడు.