హైదరాబాద్: ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతాపై నాలుగు వికెట్ల తేడాతో ముంబై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోల్కతా నైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మాట్లాడుతూ చెత్త ఫీల్డింగ్ వల్లే ఈ బాధాకరమైన ఓటమి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశాడు.
'పాండ్యా ఇచ్చిన క్యాచ్ను పట్టుకొని ఉంటే.. మ్యాచ్ స్వరూపమే మారిపోయేది. మా బౌలర్లు చక్కగానే బౌలింగ్ చేశారు. క్రిస్ వోక్స్, ట్రెంట్ బౌల్ట్ అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా. మేం ఇంకాస్తా నింపాదిగా ప్రశాంతంగా ఉండాల్సింది. చివర్లో క్యాచ్ వదిలేయడం, మిస్ ఫీల్డిండ్ వల్ల మేం కొంత భయానికి లోనయ్యాం' అని చెప్పుకొచ్చాడు.

మరోవైపు ముంబై ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా, నితీశ్ రానా అద్భుతంగా ఆడి మ్యాచ్ను మాకు దూరం చేశారని గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఆటగాళ్లు నితీశ్ రాణా (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో వాంఖడెల ముంబై లీగ్లో బోణీ చేసింది.
చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో వీరిద్దరూ సెంచరీలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.5 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 180 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ తర్వాత వరుసగా మూడు ఓవర్లలో పార్థివ్ పటేల్ (30; 3 ఫోర్లు, 1 సిక్సు), బట్లర్ (28; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (2) వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రానా నిలకడగా ఆడుతూ చివరి మూడు ఓవర్లలో నితీశ్ రాణా బౌండరీలతో చెలరేగాడు.
ఈ క్రమంలో 19వ ఓవర్లో నితీశ్ రానా పెవిలియన్ కు చేరడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మరో బంతి మిగిలి ఉండగానే కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.