హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో గుజరాత్ లయన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న గుజరాత్ లయన్స్కు ఇది నిజంగా శుభవార్తే. తొడ కండరాల గాయంతో టోర్నీలో ఆరంభ మ్యాచ్లకి డ్వేన్ బ్రావో దూరమైన సంగతి తెలిసిందే.
అయితే ఆ గాయం నుంచి కోలుకున్న డ్వేన్ బ్రావో త్వరలో గుజరాత్ లయన్స్ తరుపున బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియాలో గతేడాది డిసెంబరులో జరిగిన బిగ్బాస్ లీగ్లో గాయపడిన బ్రావో అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ఆరంభ సమయానికి బ్రావో ఫిటెనెస్ సాధించలేదు.
దీంతో అతడు జట్టుతో చేరినా మైదానంలోకి మాత్రం అడుగుపెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రావో తన గాయంపై ట్విట్టర్లో స్పందించాడు. 'ఒక మ్యాచ్ లేదా రెండో మ్యాచ్ తర్వాత నేను మైదానంలోకి దిగుతా. పూర్తిగా ఫిటెనెస్ సాధించకుండానే మ్యాచ్ ఆడే నేను సాహసం చేయదల్చుకోలేదు' అని ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే బ్రావో జట్టుతో చేరితో గుజరాత్ బౌలింగ్ విభాగంతో పాటు.. మిడిలార్డర్ పటిష్టమవుతుంది. గత సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన బ్రావో 17 వికెట్లు తీశాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో విఫలమైన గుజరాత్ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇప్పటికే ఈ సీజన్లో ఐదు మ్యాచ్లాడిన గుజరాత్ లయన్స్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది.