హైదరాబాద్: గత సీజన్లో రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లు ఐపీఎల్ పదో సీజన్లో అభిమానులను అలరించడంలో విఫలమయ్యాయి. అంతేకాదు ఈ సీజన్లో కిందనుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సైతం దూరం చేసుకున్నాయి.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
గత సీజన్లో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఈ రెండు జట్లూ చెరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నప్పటికీ, ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశాలను కోల్పోయాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే ఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లాడి ఏడింట్లో విజయం సాధించిన కోల్కతా, పూణె జట్లకు మెరుగైన అవకాశాలుండగా, ఆరు మ్యాచ్లు గెలిచిన సన్ రైజర్స్ మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది.
మే 6వ తేదీన పూణెతో, మే 8వ తేదీన ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. ఈ రెండింటిలో విజయం సాధిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ బరిలో నిలుస్తుంది. మరోవైపు ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లకు ప్రస్తుతానికి ప్లే ఆఫ్కు చేరే అవకాశాలున్నాయి.

కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 5 పాయింట్లతో పట్టికలో ఆఖరి స్ధానంలో ఉంది. ఇప్పటివరకు 10 ఆడిన కోహ్లి సేన కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడింది. వర్షం కారణంగా సన్రైజర్స్తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
ఇక గుజరాత్ లయన్స్ విషయానికి వస్తే 6 పాయింట్లతో గుజరాత్ లయన్స్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన సురేశ్ రైనా జట్టు కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచుల్లో పరాజయం పాలైంది.