హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో వర్షం హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై కోల్ కతా ఏడు వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం కోల్కతా కెప్టెన్ గంభీర్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ)కి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 128 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న సన్రైజర్స్ క్వాలిఫయిర్-2కు అర్హత సాధించేది. అయితే రాత్రి 12:55 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కోల్కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు.
లక్ష్య ఛేదనలో క్రిస్ లిన్ (6), రాబిన్ ఊతప్ప(1), యూసుఫ్ పఠాన్(0) త్వరగానే అవుటైనా.. కెప్టెన్ గంభీర్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. గంభీర్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్) రాణించడంతో కోల్కతా క్వాలిఫయర్-2 దూసుకెళ్లింది. ఇక ఈ విజయంతో గతేడాది ఎలిమినేటర్లో రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి కోల్కతా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
నిజానికి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్ సిస్టమ్ అద్భుతంగా ఉండటం వల్లే మైదానంలోని వర్షపు నీటిని త్వరగా బయటకు వెళ్లేలా చేయగలిగారని గంభీర్ ట్విట్టర్లో కొనియాడాడు. వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగిన సమయంలో తాను టెన్షన్కు గురయ్యానని చెప్పాడు.
అయితే తాము స్కోర్ గురించి ఏ మాత్రం భయపడలేదని చెప్పుకొచ్చాడు. 160 పరుగులు చేసుంటే మంచి టార్గెట్ అనుకునేవాళ్లమని, కానీ స్కోర్ అంతకంటే తక్కువే ఉందని తెలిపాడు. తమ జట్టు ప్రతీ మ్యాచ్లో 200 టార్గెట్ను ఎదుర్కొనేలా సిద్ధపడి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పరుగుల కట్టడి చేసి, వికెట్లు తీసిన బౌలర్లకే పూర్తి క్రెడిట్ దక్కుతుందని గంభీర్ చెప్పాడు. బౌలర్ల సమష్టి కృషి వల్ల సన్రైజర్స్పై విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. 128 పరుగులకే సన్రైజర్స్ను నిలువరించగలగడం అభినందనీయమని, ఇది బౌలర్లు గెలిపించిన మ్యాచ్ అని గంభీర్ చెప్పాడు.