హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో తాను 'గోల్డెన్ డక్'గా అవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు.
కోల్కతా బౌలర్ నాథన్ కౌల్టర్-నైలీ బౌలింగ్లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చేతికిలోకి వచ్చిన బంతిని పాండే అమాంతం ఒడిసిపట్టాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న కోహ్లి అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. కోపంతో కాలికి కట్టుకున్న ప్యాడ్లపై బ్యాట్తో బాదుకున్నాడు.
డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో అంఫైర్ ఏం జరిగిందని కోహ్లీని ప్రశ్నించగా, స్టాండ్స్ వైపు చూపిస్తూ ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించారని వెల్లడించాడు. సైట్ స్క్రీన్ దగ్గర ఓ వ్యక్తి తచ్చాడుతుండాన్ని కోహ్లీ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు.

ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని సైట్ స్క్రీన్ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని పంపించి వేశారు. దీంతో కోహ్లీ శాంతించాడు. ఇదే విషయాన్ని టీవీ కామెంటేటర్గా ఉన్న రవిశాస్త్రి ప్రముఖంగా ప్రస్తావించాడు. 'దేని గురించో కోహ్లీ సంతోషంగా లేడు' అని రవిశాస్త్రి అన్నాడు.
ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ దీనిపై స్పందించాడు. 'ఇక్కడ సైట్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉంది. దాని దగ్గర ఓ వ్యక్తి నిలబడి బౌలర్లా విన్యాసాలు చేశాడు. దీంతో నా ఏకాగ్రత భంగం కలిగి నేను ఆటపై దృష్టి పెట్టలేకపోయాను. కానీ పెద్ద విషయం కాదు' అని కోహ్లీ అన్నాడు.
ఇదిలా ఉంటే ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది. దీంతో పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో కోల్కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.