హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా గురువారం పంజాబ్, కోల్కతా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు ఏసీ యూనిట్లతో పాటు ప్రెస్ బాక్స్ అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.
అయితే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్టేడియానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తొలుత స్టేడియంలోని ప్రెస్ బాక్స్కు అతి సమీపంలో ఉన్న టీవీ-రేడియో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించి రెండు ఏసీలు తగలబడ్డాయి.

ఎకనమిక్స్ టైమ్స్లో ప్రచురించిన కథనం ప్రకారం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని, చిన్న ప్రమాదమేనని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అగ్నిప్రమాదం సంభవించలేదని, కేవలం పొగ మాత్రమే రావడంతో దానిని అదుపు చేశామని తెలిపారు.
మ్యాచ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 10వ సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న 11వ మ్యాచ్కు ముందు ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఐపీఎల్ పదో సీజన్లోని మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల్లో తొలి మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గురువారం తొలి మ్యాచ్ జరుగుతుంది. దీంతో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ డ్యాన్స్ చేసింది. దీంతో పాటు బెంగాలీ సంప్రదాయ నృత్యాలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మోనాలీ ఠాకూర్ తన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. బాణా సంచా పేల్చి తొలి మ్యాచ్ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.