హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా గుజరాత్ లయన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 209 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 97 పరుగులు చేసి అవుటయ్యాడు. బాసిల్ తంపి బౌలింగ్లో కీపర్ దినేశ్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

మరో ఆటగాడు సంజూ శాంసన్ కూడా 61 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి సిక్స్ బాదడం ద్వారా ఐపీఎల్ పదో సీజన్లో 500వ సిక్స్ కొట్టిన ఆడగాడిగా సంజూ శాంసన్ గుర్తింపు పొందాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ ఆ జట్టు పేరిట ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసినప్పటికీ పరాజయం పాలైంది.
ఢిల్లీ విజయ లక్ష్యం 209
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్డెవిల్స్కు 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కెప్టెన్ సురేశ్ రైనా (77), దినేశ్ కార్తీక్ (65) పరుగులతో రాణించడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మెకల్లమ్ (1), డ్వేన్ స్మిత్(9) పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఒకవైపు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూనే మరొకవైపు వికెట్లను కాపాడుకుంటూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రైనా అర్ధ సెంచరీని పూర్తి చేరాడు.
ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఆడిన రైనా జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రనౌటయ్యాడు. దీంతో వీరిద్దరి 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ భారీ షాట్కు యత్నించి 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 65 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.
కమిన్స్ బౌలింగ్లో కోరీ అండర్సన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక చివర్లో అరోన్ ఫించ్ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (7 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) పరుగులతో రాణించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా, ప్యాట్ కమ్మిన్స్ తలో రెండు వికెట్లు తీయగా కోరీ అండర్సన్ ఒక వికెట్ తీశాడు.
గుజరాత్పై ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఢిల్లీ జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో కరుణ్ నాయర్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఢిల్లీ జట్టులో మోరిస్, మ్యాథ్యూస్, జయంత్ యాదవ్ స్ధానంలో కమ్మిన్స్, శామ్యూల్స్, నదీమ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. గుజరాత్ మాత్రం గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది.
కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్లాడిన ఢిల్లీ మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. పది మ్యాచ్లాడిన గుజరాత్ మూడింట్లో విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై సమష్టిగా పోరాడి విజయం సాధించిన ఢిల్లీ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.