హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఎంటర్టైన్ మెంట్. ఐపీఎల్ 10వ సీజన్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో ముంబైపై పూణె ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్కు మహేంద్ర సింగ్ ధోనీ పంచ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పదేళ్ల తర్వాత ఐపీఎల్లో ధోని నాన్ కెప్టెన్గా ఆడుతున్న సంగతి తెలిసిందే.
పూణె మ్యాచ్లో పీటర్సన్కు ధోని పంచ్ ఇదే: వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ధోని వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో కామెంటేటర్గా ఉన్న పీటర్సన్.. అతని పక్కనే ఉన్న మనోజ్ తివారీతో మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనికి చెప్పు అతని కంటే నేనే బెస్ట్ గోల్ఫర్నని అంటూ తివారీతో పీటర్సన్ అన్నాడు. దీంతో ఆ విషయాన్ని తివారీ ధోనికి చెప్పాడు.

వెంటనే స్పందించిన ధోనీ టెస్టుల్లో నా ఏకైక వికెట్ నీదే గుర్తుంచుకో అని సమాధానం చెప్పడంతో పీటర్సన్ పెద్దగా నవ్వాడు. ఈ సంభాషణ అంతా ఇన్నింగ్స్ రెండో ఓవర్లో చోటు చేసుకుంది. అసలు ధోని పీటర్సన్ వికెట్ ఎప్పుడు తీశాడా అని... అభిమానులు ఆలోచనలో పడ్డారు.
2011లో ఇంగ్లాండ్ పర్యటనలో క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ధోని బౌలింగ్ చేశాడు. ధోని బౌలింగ్లో పీటర్సన్ అవుటయ్యాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ అవుట్ కూడా ఇచ్చిన అనంతరం రీప్లేల్లో బాల్ కేపీ బ్యాట్ను తగల్లేదని తేలింది.
దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో ఆ తర్వాత కేపీ ఆ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ విషయాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్న ధోని.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో ఇప్పటికీ టెస్టుల్లో పీటర్సన్ని తాను అవుట్ చేసినట్లు భావిస్తున్నాడు.