హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం బెంగళూరులో మొదలైంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇందులో 76 మందిని ఈ వేలంలో కొనుగోలు చేయనున్నారు. ఈ వేలంలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు నిరాశ ఎదురైతే, తొలిసారి ఐపీఎల్ వేలం బరిలో నిలిచిన ఆఫ్ఘానిస్థాన్ మాత్రం ఆకట్టుకుంది.
ఐపీఎల్ వేలంలో ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు మెరిశారు. అసోసియేట్ దేశంగా అతి కొద్ది మంది సభ్యులతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్ వేలంలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. ఐపీఎల్ వేలంలో ఉన్న ఆప్ఘనిస్థాన్ ఐదుగురు ఆటగాళ్లలో మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.

ఈ ఇద్దరు ఆటగాళ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తొలుత మొహ్మద్ నబీని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ, ఆ తర్వాత లెగ్ స్ఫిన్నర్ రషీద్ ఖాన్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో నబీ ఆల్ రౌండర్గా రాణిస్తున్నాడు.
ఐపీఎల్ వేలంలో నబీని సన్ రైజర్స్ తొలుత కొనుగోలు చేయడం ద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా నబీ గుర్తింపు పొందాడు. కుడి చేత వాటం ఆటగాడైన నబీ, ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఆఫ్ఘానిస్థాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా, 73 వికెట్లు తీశాడు.
ఇక రషీద్ ఖాన్ విషయానికి వస్తే తన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ అతనికి భారీ మొత్తంలో చెల్లించి ఆకట్టుకుంది. ఆప్ఘనిస్థాన్ తరుపున ఇప్పటి వరకూ రషీద్ 18 వన్డేల్లో 31 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ అత్యుత్తమం 4/21. రషీద్ ఇప్పటివరకు 21 టీ20 మ్యాచ్ల్లో 31 వికెట్లను సాధించాడు