బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 108(8 ఫోర్లు, 7 సిక్స్లు) పరుగులు చేసి తన జట్టుకు విజయాన్నందించాడు.
కాగా, కోహ్లీకి ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. 56 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ పూర్తి చేయడం విశేషం. శనివారం మొదట బ్యాటింగ్ చేసిన పుణె.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. 48 బంతుల్లో 74(8ఫోర్లు, 2సిక్స్లు) పరుగులు చేసిన అజింక్యా రహానే టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్తో బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ లేకపోవడంతో 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం బెంగళూరుకు కష్టమనే అనుకున్నారంతా. కానీ, కోహ్లీ ఆటను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. 3 ఓవర్లకు బెంగళూరు స్కోరు 10 పరుగులే చేసినా ఈ జంట ఆ తర్వాత ధాటిగా ఆడింది. నాలుగో ఓవర్లో రెండు సిక్సులతో మొదలైన బెంగళూరు జోరు విజయం వరకూ ఆగలేదు.
అయితే ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రాహుల్ ఔట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ ఓవర్లోనే డివిలియర్స్ (1) కూడా ఔట్ కావడంతో బెంగళూరుకు పెద్ద దెబ్బ తగిలింది. మరోవైపు 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి పరుగుల వేట ఆపలేదు. వాట్సన్ రాకతో బెంగళూరు ఇన్నింగ్స్ రూపే మారిపోయింది.
42 బంతుల్లో 89 పరుగులు అవసరమైన స్థితిలో పెరీరా వేసిన 14వ ఓవర్లో 5 ఫోర్లు బాదిన వాట్సన్.. ఆ తర్వాత మరో రెండు సిక్స్లు కొట్టి బెంగళూరును పోటీలోకి తెచ్చాడు. ఆ తర్వాత వాట్సన్ ఔటైనా.. కోహ్లి మాత్రం తగ్గలేదు. మూడు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విరాట్ అద్భుతంగా ఆడాడు.
జంపా బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన కోహ్లీ.. ఆ తర్వాత మరో ఫోర్ కొట్టడంతో బెంగళూరు సాధించాల్సిన లక్ష్యం చిన్నదైపోయింది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి ఉండగా మరో రెండు సిక్స్లు బాదిన విరాట్ బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

కోహ్లీ రికార్డులు:
ఒకే ఐపిఎల్ సీజన్లో రెండు అజేయ శతకాలు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ.
మూడు ఐపిఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2013లో 634 పరుగులు, 2015లో 505 పరుగులు చేశాడు. కోహ్లీ కాకుండా సచిన్ మాత్రమే రెండు ఐపిఎల్ సీజన్లలో (2010లో 618, 2011లో 553పరుగులు) 500కు పైగా పరుగులు నమోదు చేశాడు.
ఓ ఐపిఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2013లో 634 పరుగులు చేశాడు. ఈసారి ఆ రికార్డును తనే బద్దలు కొట్టే అవకాశముంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు కోహ్లీ 541 పరుగులు చేశాడు.