ముంబై: మహారాష్ట్ర నెలకొన్న నీటి కొరత నేపథ్యంలో ముంబైలో నిర్వహించాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఏప్రిల్ 30 నుంచి రద్దు చేయాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముంబైలో జరిగే మ్యాచ్లను ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఇప్పటికే బిసిసిఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
కాగా, నీటి కొరత నేపథ్యంలో మ్యాచ్ల తరలింపు విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాలంటూ అతని చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. భారతరత్న అందుకున్న అతడే స్పందించాలని కాంబ్లీ కోరాడు. దీంతో, అనవసర వివాదంలోకి సచిన్ ను లాగారంటూ కాంబ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు కురుస్తుండటం గమనార్హం.

ఐపిఎల్ మ్యాచ్ల తరలింపుపై భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ స్పందించాలని కాంబ్లీ కోరడంపై సచిన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. 'నీలాంటి స్నేహితులుంటే.. ప్రత్యేకంగా శత్రువులు అవసరం లేదు' అంటూ కొందరు ఘాటుగా విమర్శించారు.
అనవసర విషయాల్లో దిగ్గజాన్ని ఎందుకు లాగుతున్నావంటూ మండిపడ్డారు. తనకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతోనే ఇలాంటి అనవసర విషయాల్లోకి సచిన్ ను లాగి ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ జీవితంలో కరువు లేకుండా చూసుకో' అంటూ ఎద్దేవా చేశారు. 'మహారాష్ట్రకు చెందిన నీవు.. ఏమైనా సాయం చేశావా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, సచిన్ ను ఇలాంటి వివాదాల్లోకి లాగడం కాంబ్లీకి ఇది మొదటిసారేం కాదు. గతంలో ఓసారి సచిన్ తనకు ఎలాంటి సాయం చేయలేదని, లేదంటే మరోలా తన జీవితం ఉండేదని పేర్కొన్నాడు. కాగా, అప్పట్నుంచి సచిన్.. కాంబ్లీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.