బెంగళూరు: అరచేతికి ఏఢు కుట్లు పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ విధ్వంసం ఆగలేదు. బీభత్సమైన ఫాంను కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. గురువారం కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు కోహ్లీ.
విరాట్ కోహ్లి 113(50 బంతుల్లో 12ఫోర్లు, 8సిక్సర్లు), గేల్73(32 బంతుల్లో 4ఫోర్లు, 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ/లూ పద్ధతిలో 82 పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్ను చిత్తుగా ఓడించింది. వర్షం వల్ల ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో మొదట బెంగళూరు 3 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కొండంత లక్ష్యంతో డీలాపడ్డ పంజాబ్ ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులే చేయగలిగింది. సాహా (24) టాప్ స్కోరర్. ఈ విజయంతో బెంగళూరు తన ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. బెంగళూరు తన చివరి మ్యాచ్లో ఢిల్లీపై గెలిస్తే ముందంజ వేస్తుంది.

కాగా, బుధవారం నాటి మ్యాచ్లో పంజాబ్ బౌలర్లను పూర్తిగా నిస్సహాయులుగా మార్చేస్తూ కోహ్లి, గేల్ల ఊచకోత కోశారు. పంజాబ్ బౌలర్లు ఏమాత్రమైన మ్యాచ్లో నిలిచారు అంటే అది తొలి మూడు ఓవర్లలోనే. అప్పటికి స్కోరు 17. ఇక నాలుగో ఓవర్ నుంచి గేల్, కోహ్లిల బాదుడుకు బంతి మైదానంలో కంటే గాల్లోనో, బౌండరీ బయటనో ఎక్కువగా కనిపించింది.
అబాట్ బౌలింగ్లో వరుసగా 6, 6, 4 బాదేయడంతో ద్వారా పరుగుల ప్రవాహానికి గేట్లెత్తిన గేల్.. వెంటనే కరియప్ప బౌలింగ్లోనూ సిక్స్, ఫోర్ కొట్టేశాడు. కోహ్లి కూడా వెంటనే టాప్ గేర్లోకి వచ్చేశాడు. వేలి గాయమై కుట్లు పడ్డా అతడిలో ఏమాత్రం కసి తగ్గలేదు. కరియప్ప ఓవర్లో ఫోర్, రెండు సిక్స్లు దంచేశాడు. గేల్, కోహ్లి సిక్స్ల పోటీతో స్కోరు బోర్డు అలసిపోయింది.
అక్షర్ ఓవర్లో గేల్ రెండు సిక్స్లు, కరియప్ప బౌలింగ్లో కోహ్లి లాంగాఫ్, లాంగాన్, డీప్ మిడ్వికెట్లో మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదేయడంతో బెంగళూరు 10 ఓవర్లకే 129/0తో నిలిచింది. కోహ్లి 28 బంతుల్లో, గేల్ 26 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. ఆ తర్వాత విధ్వంసమేమీ తగ్గలేదు. అక్షర్ ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన గేల్.. అదే ఊపులో మరో షాట్ ఆడబోయి ఔటైనా కోహ్లి మాత్రం తగ్గలేదు.
మోహిత్ శర్మ బౌలింగ్లో వరుసగా మూడు ముచ్చటైన ఫోర్లతో 90ల్లోకి చేరుకున్నాడు. 14వ ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ లాంగాన్ల మధ్య ఫ్లిక్తో బంతిని బౌండరీ దాటించి 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే మరో సిక్స్, ఫోర్ కొట్టేసి ఆ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. కాగా, కోహ్లీ మైదానం వీడుతున్న సమయంలో ప్రేక్షకుల హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు.
కోహ్లీ రికార్డులు-విశేషాలు
9 నుంచి 11 ఓవర్ల మధ్య 13 బంతుల వ్యవధిలో గేల్-కోహ్లి కలిసి 8 సిక్సర్లు బాదడం విశేషం. ఒకే ఐపిఎల్ సీజన్లో నాలుగు సెంచరీలు సాధించడం మరో విశేషం.
ఐపిఎల్లో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు(865-13మ్యాచుల్లో) చేసిన ఆటగాడి కోహ్లీ రికార్డు సృష్టించాడు
ఐపీఎల్ శతకాలకు కోహ్లి తీసుకున్న బంతులు మొదటిది 63, రెండవది 56, మూడవది 53, నాలుగవది 47.
ఐపీఎల్ మ్యాచ్ల్లో ఇప్పటివరకూ కోహ్లి సాధించిన పరుగులు 4002.
టోర్నీలో 4వేల పరుగుల మైలురాయి దాటిన ఆటగాడు అతడొక్కడే. బుధవారం శతకంతో రైనా (3985)ను కోహ్లి అధిగమించాడు.
ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో (6337), అంతర్జాతీయ టీ20ల్లోనూ (1641) భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లినే.