బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ లేకుండా రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఎందుకంటే క్రిస్ గేల్ భాగస్వామి నటాషా బెరిడ్జ్ ప్రస్తుతం గర్భవతి. ఆమె తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న తరుణంలో గేల్ జమైకాకు బయల్దేరాడు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 22న రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్లతో జరిగే మ్యాచ్లలో క్రిస్ గేల్ ఆడే అవకాశం లేదు. ఆర్సీబీ అధికారి ఒకరు వన్ ఇండియాతో ఈ విషయాన్ని వెల్లడించారు.
తను ప్రయాణిస్తున్న విమానంలో 'ఐయామ్ అన్దీవే, బేబీ' అని కేక్పై రాసి, దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు క్రిస్ గేల్.

కాగా, ఐపిఎల్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ క్రిస్ గేల్ విఫలమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 3 బంతులాడిన గేల్.. కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో జహీర్ ఖాన్ వేసిన బంతికి గేల్ డకౌట్గా వెనుదిరిగాడు.
గేల్ రెండు మ్యాచ్ల్లో విఫలమవడంపై స్పందించిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ.. గేల్ మళ్లీ పుంజుకుంటాడని, తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని అన్నాడు. అవసరమైన సమయంలో జట్టు కోసం వంద పరుగులైనా చేయగలడని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.