ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు తమను దేవుళ్లుగా చూశారని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా అన్నాడు. క్రికెట్ ఇక్కడ ఓ మతం అని, చెన్నై జట్టులో ఉండగా తమను దేవుళ్లుగా కొలిచారని చెప్పాడు.
ఐపీఎల్లో ఎనిమిదేళ్లు ఆడిన చెన్నై సూపర్కింగ్స్ జట్టును వదిలేసి ఈ ఏడాది కొత్త జట్టుకు గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించబోతుండటం భిన్నమైన అనుభూతిని కలిగిస్తోందన్నాడు. ఎనిమిదేళ్ల పాటు ఉన్న ఇంటిని వదిలేసి వచ్చేసినట్లు అనిపిస్తోందని, ఈసారి లీగ్ నాకు కొత్తగా ఉంటుందని, గుజరాత్ జట్టులో బ్రెండన్, బ్రావో లాంటి ఆటగాళ్ల అనుభవం మాకెంతో ఉపయోగపడుతుందని చెప్పాడు.
బ్రాత్వైట్ ఐపీఎల్లోనూ చెలరేగుతాడు: జహీర్ ఖాన్
ట్వంటీ 20 ప్రపంచ కప్ తుది మ్యాచులో వరుసగా నాలుగు సిక్సర్లతో వెస్టిండీస్ను విజేతగా నిలిపిన ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ ఐపీఎల్లో తమ జట్టు తరఫున కూడా అదే స్థాయిలో చెలరేగుతాడని ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ అనేది ఆటగాళ్ల ఊపు మీదే ఆధారపడి ఉంటుందన్నాడు. ప్రతి ఆటగాడి ప్రదర్శన కీలకమని చెప్పాడు. ప్రపంచకప్ ఫైనల్ ప్రదర్శన బ్రాత్వైట్కు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉంటుందని, అదే విశ్వాసాన్ని ఐపీఎల్లోనూ కొనసాగిస్తాడని అనుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్లో యువ ఆటగాళ్లను నడిపించడం తనకు దక్కిన మంచి అవకాశమన్నాడు.