కాన్పూర్: ఐపీఎల్ 9 ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు రాత్రి ముంబై ఇండియ్స్ పైన గుజరాత్ లయన్స్ విజయం సాధించింది. దీంతో అది ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బెర్త్ ఖాయం చేసుకుంది.
మరో రెండు జట్ల కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నాలుగు జట్లకు మించి మొత్తం 8 లేదా అంతకంటే ఎక్కువ విజయాలు సాధించి 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే పరిస్థితి లేదు. దీంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే.
ఆదివారం జరిగే చివరి రెండు లీగ్ మ్యాచుల ఫలితాన్ని బట్టి మిగతా రెండు జట్లు తేలుతాయి.
ఆదివారం సాయంత్రం తొలి మ్యాచ్.. కోల్కతా - హైదరాబాద్ మధ్య ఉంది. ఇందులో హైదరాబాదుపై గెలిస్తే.. ఆ జట్టు మరింత ముందుకెళ్తుంది. ముంబై ఇంటికి చేరినట్లే.

ఆ తర్వాత రాత్రి బెంగళూరు - ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లది ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కానుంది.
హైదరాబాద్ చేతిలో కోల్కతా ఓడిపోతే ఆ జట్టుతో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ.. ఈ నాలుగు జట్లు రేసులో ఉంటాయి. రాత్రికి గెలిచే జట్టుతో పాటు మిగతా మూడు జట్లు తలో 7 విజయాలు సాధిస్తాయి. ఆ తర్వాత ఢిల్లీ - బెంగళూరులలో గెలిచే జట్టును, రన్ రేటును బట్టి ప్లేఆఫ్ రేసుకు ఏ జట్టు చేరుతుందో తేలుతుంది.
సాయంత్రం హైదరాబాద్ చేతిలో కోల్కతా ఓడి, రాత్రి బెంగళూరు పైన ఢిల్లీ గెలిస్తే.. కోల్కతా, ముంబై ఇంటిదారి పడతాయి. ఢిల్లీ చేతిలో దారుణంగా ఓడినా నెట్ రన్ రేట్ బెంగళూరుకు ఎక్కువగా ఉంది.
సాయంత్రం మ్యాచులో హైదరాబాద్ పైన కోల్కతా, రాత్రి మ్యాచులో ఢిల్లీ పైన బెంగళూరు గెలిస్తే ఈ రెండు జట్లు బెర్త్ ఖాయం చేసుకుంటాయి. రాత్రి మ్యాచులో బెంగళూరు పైన ఢిల్లీ గెలిస్తే ఢిల్లీ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.
గుజరాత్ విజయం
నితీశ్ రాణా (36 బంతుల్లో 70 పరుగులు అద్భుత పోరాటం వృథా అయింది. శనివారం రాణా పోరాడి ముంబైకి మంచి స్కోరు అందించినా, ఆ జట్టు దాన్ని కాపాడుకోలేకపోయింది. మొదట ముంబై 8 వికెట్లకు 172 పరుగులు చేయగా గుజరాత్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మెకల్లమ్ (27 బంతుల్లో 48), సురేశ్ రైనా (36 బంతుల్లో 58), డ్వేన్ స్మిత్ (23 బంతుల్లో 37 పరుగులు ) చెలరేగి ఆడి ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. తొలి ఓవర్లోనే ఫించ్ (0) వికెట్ కోల్పోయినా బ్రెండన్, రైనా రెండో వికెట్కు 9 ఓవర్లలోనే 95 పరుగులు జోడించి గుజరాత్ను గెలుపు బాటలో నడిపారు. వీళ్లిద్దరితో పాటు జడేజా (15 బంతుల్లో 21 నాటౌట్)తో కలిసి స్మిత్ గుజరాత్ను గెలిపించాడు.