బెంగుళూరు : ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ తో మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిపోయింది. సన్ రైజర్స్ గెలుపు, బెంగుళూరు ఓటములపై ఎవరికి నచ్చిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ గెలుపోటముల ఫీవర్ మరికొన్ని రోజులు క్రికెట్ అభిమానుల నోళ్లలో నానడం, ఆ తర్వాత అంతా మామూలైపోవడం కామనే.
అయితే.. సన్ రైజర్స్ వర్సెస్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో సచిన్ బేబీ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. క్రీజులో ఉండి టీమ్ ని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయినందుకు యువ క్రికెటర్ సచిన్ బేబీ కన్నీటి పర్యంతమయవడం పట్ల నెటిజన్లు సానుభూతి ప్రకటిస్తున్నారు.

బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుపుకు చివరి రెండు బంతుల్లో 14 పరుగులు అవసరమగా.. భువనేశ్వర్ వేసిన కట్టుదిట్లమైన బౌలింగ్ కి మొదటి బంతికి సచిన్ బేబీ సింగిల్ మాత్రమే తీయగా చివరి బంతికి అబ్దల్లా ఫోర్ కొట్టాడు. దీంతో బెంగుళూర్ జట్టు 8 పరుగుల తేడాతో సన్ రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ ప్రథమార్థం అంతా క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో చాలామంది బెంగుళూర్ విజయం దాదాపు ఖాయమనుకున్నారు. అయితే భువనేశ్యర్, ముస్తాఫిజుర్ ఖచ్చితత్వంతో కూడిన బౌలింగ్ వల్ల చేజారుతుందనుకున్న మ్యాచ్ సన్ రైజర్స్ వశం అయింది.
చివర్లో బిన్నీ, సచిన్ బేబీ పోరాడుతున్నట్టుగా కనిపించినా.. భువనేశ్వర్, ముస్తాఫిజుర్ బౌలింగ్ లో ధాటిగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో 8 పరుగుల తేడాతో ఓటమిపాలై ఐపీఎల్ టైటిల్ ని చేజార్చుకుంది బెంగుళూర్ జట్టు. ఇకపోతే, జట్టు ఓటమిపాలయ్యాక సచిన్ బేబీ క్రీజులోనే భావోద్వేగానికి లోనయ్యాడు.