ఛత్తీస్గడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 9వ ఎడిషన్లో పంజాబ్ జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్వవహరించనున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్లో పంజాబ్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన జార్జి బెయిలీ కెప్టెన్గా ఉన్నారు. కాగా డేవిడ్ మిల్లర్ నాల్గవ సీజన్లో పంజాబ్ తరుపున ఆడాడు.
ఈ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం మాట్లాడుతూ ' అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో డేవిడ్ మిల్లర్ ఒకరు. అంతేకాకుండా అతనొక విధ్వంసకర ఆటగాడు. అలాంటి వ్యక్తి మా జట్టులో ఉండటం సంతోషించదగిన విషయం' అని పేర్కొన్నారు.

పంజాబ్ జట్టుకు కెప్టెన్గా నియమించడంపై డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ ఈ సీజన్లో జట్టుకు నాయకత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. యాజమాన్యం, జట్టు సభ్యులు తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
పంజాబ్ జట్టు ప్రస్తుతం యువకులు, అనుభవాలతో నిండి ఉందని పేర్కొన్న డేవిడ్ మిల్లర్, భవిష్యత్తులో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశాడు. మరోవైపు ఇటీవలే పంజాబ్ జట్టు మెంటార్గా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ను నియమించిన సంగతి తెలిసిందే.